పాఠశాల బాలలకు రేషన్, ఆహార భద్రత భత్యం : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-05-30T23:12:14+05:30 IST
ఉత్తర ప్రదేశ్ బోర్డు పరిథిలోని మధ్యాహ్న భోజన పథకం, 2015 వర్తించే
![పాఠశాల బాలలకు రేషన్, ఆహార భద్రత భత్యం : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020053005400912/05302020174119n39.gif)
లక్నో : ఉత్తర ప్రదేశ్ బోర్డు పరిథిలోని మధ్యాహ్న భోజన పథకం, 2015 వర్తించే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఆహార భద్రత భత్యం, రేషన్ సరుకులు అందజేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం, వేసవి సెలవుల కాలంలో, అంటే మార్చి 24 నుంచి జూన్ 30 వరకు రేషన్ సరుకులు, ఆహార భద్రత భత్యం పాఠశాలల విద్యార్థులకు అందజేయాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న సుమారు 1.80 కోట్ల మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఒక్కొక్క విద్యార్థికి రూ.374 చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న ఒక్కొక్క విద్యార్థికి రూ.561 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ సొమ్మును జమ చేస్తుంది.
అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఒక్కొక్క విద్యార్థికి 7.6 కేజీల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న ఒక్కొక్క విద్యార్థికి 11.4 కేజీల చొప్పున రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంది. స్థానిక ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన రేషన్ దుకాణంలో ఈ సరుకులను ఇస్తారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవిన్యూ) రేణుక కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.