చర్చల్లో చిత్రం: కేంద్రమంత్రులు కూడా రైతులు తెచ్చుకున్న ఆహారాన్నే..!

ABN , First Publish Date - 2020-12-31T00:16:36+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య జరుగుతున్న ఆరో రౌండ్ చర్చల సందర్భంగా...

చర్చల్లో చిత్రం: కేంద్రమంత్రులు కూడా రైతులు తెచ్చుకున్న ఆహారాన్నే..!

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు నేతల మధ్య జరుగుతున్న ఆరో రౌండ్ చర్చల సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లంచ్ సమయంలో రైతులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే కేంద్రమంత్రులు పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమార్ ఆరగించారు. చర్చలు జరిగిన ప్రతిసారి రైతులు కేంద్రం వైఖరికి నిరసనగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన లంచ్‌ను తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. స్వయంగా తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే రైతులు తింటున్నారు. ఈ సారి కూడా ప్రభుత్వ లంచ్‌ను తిరస్కరించిన రైతులు, తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు. దీంతో కేంద్రమంత్రులు కూడా రైతుల వద్దకు వెళ్లి... వారితో కలిసి భోజనం చేశారు. చర్చలు జరుగుతున్న విజ్ఞాన్ భవన్ వెలుపల నుంచి ‘‘కరసేవ వాహనాన్ని’’ ద్వారా రైతులు ఆహారం తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు జరిగిన చర్చల్లో కూడా రైతులు ప్రభుత్వ లంచ్‌ను తిరస్కరించి, తమ సొంత ఆహారం భుజించారు. విజ్ఞాన్ భవన్ వెలుపల నేలమీద కూర్చుని రైతు నేతలు లంచ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. 



Updated Date - 2020-12-31T00:16:36+05:30 IST