రైతుల ఆందోళనకు నేటితో తెర : కేంద్ర మంత్రి ఆశాభావం

ABN , First Publish Date - 2020-12-30T19:12:05+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసన

రైతుల ఆందోళనకు నేటితో తెర : కేంద్ర మంత్రి ఆశాభావం

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు నేటితో (బుధవారంతో) తెర పడుతుందని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ చెప్పారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిపే చర్చలు సత్ఫలితాలు ఇస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిరసనలకు ప్రధాన కారణమైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అంశంతో సహా అన్ని విషయాలపైనా చర్చ జరుగుతుందని తెలిపారు. 


దాదాపు 40 రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చలు ప్రారంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున పాల్గొంటున్న ప్రతినిధి బృందంలో సోమ్ ప్రకాశ్‌తోపాటు, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు. 


చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని సోమ్ ప్రకాశ్ చెప్పారు. విశాల దృక్పథంతో చర్చలు జరుగుతాయని, ఎంఎస్‌పీతోపాటు అన్ని అంశాలపైనా చర్చిస్తామని చెప్పారు. రైతుల నిరసనలు ఈ రోజుతో ముగుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.  


ఇదిలావుండగా, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (పంజాబ్) జాయింట్ సెక్రటరీ సుఖ్వీందర్ సింగ్ సబ్రా మాట్లాడుతూ, నేటి చర్చల ద్వారా ఎటువంటి పరిష్కారం లభించబోదని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-30T19:12:05+05:30 IST