అమిత్ షా ప్రొఫైల్ పిక్ తొలగింపుపై లెంపలేసుకున్న ట్విటర్!
ABN , First Publish Date - 2020-11-13T18:19:20+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ ప్రొఫైల్ ఫోటోను తొలగించడంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ లెంపలేసుకుంది. కాపీరైట్ పాలసీ నిబంధనల ..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ ప్రొఫైల్ ఫోటోను తొలగించడంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ లెంపలేసుకుంది. కాపీరైట్ పాలసీ నిబంధనల కారణంగా ‘‘అనుకోని తప్పిదం’’ వల్లే తాత్కాలికంగా అమిత్ షా ప్రొఫైల్ను లాక్ చేసినట్టు పేర్కొంది. నిన్న అమిత్ షా వెరిఫైడ్ ఖాతాకి చెందిన ప్రొఫైల్ పిక్చర్ కొద్దిసేపు మాయమైన సంగతి తెలిసిందే. ఓ కాపీరైట్ హోల్డర్ ఫిర్యాదు కారణంగా ప్రొఫైల్ పిక్ను తొలగించామంటూ తొలుత పేర్కొన్న ట్విటర్.. కొద్దిసేపటికే మళ్లీ దీన్ని పునరుద్ధరించింది. ఈ ఘటనపై ట్విటర్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుండడంతో ఇవాళ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ... ‘‘అనుకోని ఓ తప్పిదం కారణంగా అంతర్జాతీయ కాపీరైట్ విధానాల కింద కొద్దిసేపు ఈ ఖాతాను లాక్ చేశాం. అయితే వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. ఈ ఖాతా ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తోంది..’’ అని పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు ఆయనకు చెందిన వెరిఫైడ్ ఖాతాలో డిస్ప్లై పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఓ తెల్ల పేజీలో చిన్న సందేశం కనిపించిన విషయం తెలిసిందే. ‘‘ఈ ఫోటో కనిపించదు. ఓ కాపీరైట్ హక్కుదారుడి నుంచి అందిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా ఈ ఇమేజ్ను తొలగించడం జరిగింది..’’ అంటూ ఓ సందేశం దర్శనమిచ్చింది.