ఆర్మీ మోహరింపుపై ట్రంప్ వెనకడుగు
ABN , First Publish Date - 2020-06-04T07:24:38+05:30 IST
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న హింసాత్మక ప్రదర్శనల ను అదుపు చేసేందుకు అవసరమైతే సైన్యాన్ని మోహరిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది...
![ఆర్మీ మోహరింపుపై ట్రంప్ వెనకడుగు](https://media.andhrajyothy.com/appimg/galleries/20200604121153/06042020015429n67.jpg)
- వైట్హౌ్స ముట్టడిపైనే ఆగ్రహం
- అల్లర్లను స్థానికంగానే అదుపు చేయాలి
- అధ్యక్ష కార్యాలయం పిలుపు
వాషింగ్టన్, జూన్ 3: నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న హింసాత్మక ప్రదర్శనల ను అదుపు చేసేందుకు అవసరమైతే సైన్యాన్ని మోహరిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లు, సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి కారణం. కనీవినీ ఎరుగని విధంగా ఆం దోళనకారులు వైట్హౌ్సను ముట్టడించడంతో ఆయన ఆగ్రహించారు. అల్లర్లను స్థానిక ప్రభుత్వాలు అదుపు చే యాల్సిందేనని స్పష్టం చేయడానికే ట్రంప్ సైన్యం ప్రస్తా వన తెచ్చారని అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ అధికారు లు వివరించారు. ఆందోళనకారులపై రాజధాని వాషింగ్టన్ లో తీవ్ర చర్యలు తీసుకుంటే దేశమంతటికీ ఉదాహరణగా నిలుస్తుందని అధ్యక్షుడు భావించినట్లు తెలిపారు. దీనికితోడు మంగళవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలన్నీ శాంతియుతంగా జరగడంతో ట్రంప్ తన వైఖరిని సడలించుకున్నట్లు తెలిసింది. రాజధానిలో పరిస్థితులు చేయిదాటితే, నిరసనలను నేషనల్ గార్డ్ దళం నియంత్రించలేకపోతే.. వైట్హౌస్, ఇతర ఫెడరల్ ప్రభుత్వ భవనాల రక్షణ బాధ్యతను ఓ ఆర్మీ డివిజన్కు అప్పగించాలని ప్లాను కూడా సిద్ధం చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే రాష్ట్రాలపై ఫెడరల్ ప్రభుత్వం పెత్తనం చేయాలనుకోవడాన్ని వైట్హౌస్ అధికారులే అంగీకరించలేదని తెలిసింది. మరోవైపు వాషింగ్టన్లో ఆందోళనకారులను చెదరగొట్టాక ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి వైట్హౌస్ నుంచి లఫాయత్ పార్కు వరకు నడిచారు. అక్కడి ఓ చర్చి వద్ద బైబిల్ పట్టుకుని నిలబడ్డారు.
దేశమంతా ఆందోళనలు జరుగుతుంటే ఫొటోలకు పోజులివ్వడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. కాగా.. వాషింగ్టన్ సోమవారం రాత్రి ప్రశాంతంగా ఉందని, పలువురిని అరెస్టు చేశారని, బలగాలు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాయని, అందరూ బాగా పనిచేశారని ట్రంప్ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా.. వాషింగ్టన్లో పోలీసు కార్యాలయాలను ఫెడరల్ భద్రతా బలగాలు తమ చేతుల్లోకి తీసుకుంటాయన్న ప్రతిపాదనను అమలు చేస్తే ట్రంప్ యంత్రాంగంపై కోర్టుకు వెళ్తామని నగర మేయర్ హెచ్చరించారు. పలు రాష్ట్రాలు కూడా ఇలాగే హెచ్చరించాయి.
కర్ఫ్యూను ఉల్లంఘించి..
న్యూయార్క్, ఫిలడెల్ఫియా, షికాగో, వాసింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు కర్ఫ్యూను ఉల్లంఘించి వీధులకెక్కారు. ఫ్లాయిడ్ జన్మస్థలం హూస్టన్లో 60 వేల మంది ప్రదర్శన నిర్వహించారు. ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినియాపోలిస్ పోలీసులపై పౌర హక్కుల ఉల్లంఘన విచారణ జరుగనుంది. అమెరికన్లంతా ప్రశాంతంగా ఉండాలని.. కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని.. వీధుల్లోని జనమంతా ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడపాలని ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పిలుపిచ్చారు. వివక్ష, అసమానతలపై పారదర్శకంగా చర్చ జరగాలని భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా వ్యాఖ్యానించారు. విషాదకర వైఫల్యాలను అధ్యయనం చేసి.. సమన్యాయం కోసం అందరూ పాటుపడాలని మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ఆయన భార్య లారా పిలుపునిచ్చారు.
75 మందిని కాపాడాడు!
ఈ భారతీయ అమెరికన్ రియల్ హీరో
అది సోమవారం రాత్రి.. వాషింగ్టన్ డీసీ.. ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికా రాజధానిలో పెద్దఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులను పోలీసులు తరిమి కొడుతున్నారు. ప్రాణభయంతో పరుగెడుతున్నవారిని ఇండో-అమెరికన్ వ్యాపారి రాహుల్ దూబే చూశారు. వారికి తన ఇంట్లో రక్షణ కల్పించారు. 75 మంది ఆయన ఇంట్లో కూర్చున్నారు. ఆయన రియల్ హీరో అంటూ పత్రికలు ఆకాశానికెత్తాయి. నల్లజాతీయులు కూడా దూబేను కొనియాడుతున్నారు.