ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి..

ABN , First Publish Date - 2020-04-05T16:32:52+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌లో కరోనా వైరస్‌ నివారణకు ప్రివెంటివ్‌ ఔషధంగా...

ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌లో కరోనా వైరస్‌ నివారణకు ప్రివెంటివ్‌ ఔషధంగా వినియోగిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేయాల్సిందిగా ప్రధాని మోదీని ట్రంప్ కోరారు. అమెరికా ఆర్డర్ చేసిన వరకైనా పంపాలని మోదీకి చెప్పారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులను, భారత్‌కు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను మలేరియా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నివారణ చికిత్సకు వినియోగిస్తారు. క్లినికల్‌గా ఇంకా రుజువు కాకపోయినా కోవిడ్‌-19 వైరస్‌ నివారణకు ఇది బాగా ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్నారు.


కరోనా వైరస్‌ నివారణకు ప్రివెంటివ్‌ ఔషధంగా హైడ్రాక్సిక్లోరోక్విన్‌ వాడకాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఇప్పటికే అనుమతించింది. ఇదిలా ఉంటే, అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగా నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి పైగా కరోనా మహమ్మారి సోకి మరణించారు.

Updated Date - 2020-04-05T16:32:52+05:30 IST