ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కరోనా!
ABN , First Publish Date - 2020-11-03T14:18:28+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఎంతటి విలయం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఎంతటి విలయం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల కోసం ర్యాలీలు నిర్వహించారు. వీటిలో వేలాదిమంది అభిమానులు పాల్గొన్నారు కూడా. కరోనా మహమ్మారి భయంతో ప్రత్యర్థి జోబైడెన్ మాత్రం చిన్న చిన్న మీటింగులు సమావేశాలే నిర్వహించారు. ట్రంప్ మాత్రం వైరస్ను ఏమాత్రం లెక్కచేయలేదు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఓ సర్వేలె షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించింది. ఇప్పటికి 87లక్షలపైగా కరోనా కేసులు, 2.5లక్షల వరకూ మరణాలతో అగ్రరాజ్యం అట్టుడికిపోతోంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలకపాత్ర పోషిస్తోంది. ఇటువంటి సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు. గుంపులుగా బయట కలవొద్దని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని జాగ్రత్తలు చెప్పారు. అయితే సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ సూచనలు పట్టించుకోలేదు.
అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం ట్రంప్.. జూన్ 20 నుంచి సెప్టెంబరు 22 మధ్య భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ రెండు నెలల కాలంలో 18 ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. వీటికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే సామాజిక దూరం, మాస్క్ వంటి జాగ్రత్తలు మాత్రం పెద్దగా పాటించలేదు. ఈ కారణంగా ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాల్లో సాధారణం కన్నా కనీసం 30వేల కరోనా కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీ చేసిన ఓ సర్వేలో వెల్లడైంది.

ర్యాలీ జరగడానికి ముందు ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, ప్రజలు తీసుకున్న జాగ్రత్తలను పరిశోధకులు గుర్తించారు. అలాగే ర్యాలీ తర్వాత అక్కడి పరిస్థితుల్లో వచ్చిన మార్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీటన్నింటిపై చేసిన అధ్యయనం ప్రకారం, ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల వల్ల కనీసం 30వేల మందికి అదనంగా కరోనా సోకిందని తేలింది. అలాగే మొత్తం 700మందికిపైగా ఈ వైరస్కు బలయ్యారని పరిశోధకులు తేల్చారు. మృతులంతా ర్యాలీలో పాల్గొన్న వాళ్లు కారని చెప్పారు. ర్యాలీకి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకిన కొందరు మరణించినట్లు సర్వేలో తేలినట్లు సమాచారం.

‘‘ట్రంప్పై అభిమానంతో ర్యాలీల్లో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు అనారోగ్యం పాలయ్యారు’’ అని సదరు సర్వే పేర్కొంది. ఇలాంటి ఈవెంట్ల వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందన్న పరిశోధకులు.. ఇలాంటి మీటింగులు ‘‘సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు’’ మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్.. ఈ సర్వేపై స్పందించారు. ట్రంప్కు ఎవర్నీ పట్టించుకోరని, సొంత ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించరని విమర్శించారు.