తాజ్ మహల్ వద్ద ట్రంప్ అసలు చూడాల్సింది చూడలేదట... కారణం తెలిస్తే..!
ABN , First Publish Date - 2020-02-25T18:35:58+05:30 IST
తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న చారిత్రక కట్టడం తాజ్ మహల్ను వీక్షించారు. అయితే...
న్యూఢిల్లీ: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న చారిత్రక కట్టడం తాజ్ మహల్ను వీక్షించారు. అయితే ఈ సందర్భంగా ఆయన తాజ్ మహల్లోని కీలకమైన ఒరిజినల్ సమాధి స్థలాన్ని చూడలేకపోయారు. ట్రంప్ ఎత్తు కారణంగా ఆయన లోపల పట్టరంటూ భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు సమాచారం. ట్రంప్కు తాజ్మహల్ చూపించిన ప్రముఖ గైడ్ నితిన్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘తాజ్ మహల్ అందాలకు ట్రంప్ మంత్రముగ్దుడయ్యారు. అయితే మొఘల్ రాజు షాజహాన్, ఆయన సతీమణి ముంతాజ్ల అసలు సమాధులను మాత్రం ఆయన చూడలేకపోయారు. ఒరిజినల్ సమాధుల వద్దకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండడంతో ఆయన లోపలికి వెళితే గాయపడతారని భద్రతా సిబ్బంది కంగారుపడ్డారు..’’ అని వెల్లడించారు. గత ఏడాది వైట్ హౌస్ వెల్లడించిన ఫిజికల్ ఎగ్జామినేషన్ వివరాల ప్రకారం... ట్రంప్ ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు. దీంతో భద్రతా సిబ్బంది చెప్పినట్టు ఆయన అసలు సమాధులను చూడడానికి వెళితే కచ్చితంగా ఇబ్బంది పడేవారే!