చేతబడి అనుమానంతో ఇద్దరిని కొట్టిచంపారు
ABN , First Publish Date - 2020-10-03T08:38:02+05:30 IST
చేతబడి చేశారన్న అనుమానంతో ఇద్దరిని అల్లరిమూక కొట్టి చంపింది...

తల నరికి మృతదేహాల కాల్చివేత ... అసోంలో అల్లరిమూక ఘాతుకం
గువహటి, అక్టోబరు 2: చేతబడి చేశారన్న అనుమానంతో ఇద్దరిని అల్లరిమూక కొట్టి చంపింది. అనంతరం ఆ మృతదేహాల తల నరికి తగులబెట్టింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ దారుణం అసోంలో అంగ్లోంగ్ జిల్లాలోని రోహిమాపూర్ గ్రామంలో జరిగింది. శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రమావతి, బిజోయ్ గౌర్ అనే వ్యక్తులు గ్రామంలో చేతబడి చేసి ఒకరిని చంపేశారని నిందితులు ఆరోపించారు. సెప్టెంబరు 29న గ్రామానికి చెందిన రష్మీ గౌర్ అనే యువతి చనిపోయింది. ఆ ఇద్దరూ చేతబడి చేసినందువల్లే తాను జబ్బుపడ్డానని చనిపోయే ముందు స్థానికులకు ఆమె చెప్పింది. గ్రామపెద్ద ఇంట్లో పనిచేసే ఓ బాలిక కూడా ఇలాగే ఆరోపించింది. వారు చేతబడి చేసినందువల్లే తాను అస్వస్థతకు గురయ్యానని ఆమె ఆరోపించింది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు రమావతి, బిజోయ్పై విచక్షణారహితంగా దాడిచేసి చంపేశారు. అనంతరం మృతదేహాల తల నరికి దహనం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.