ఒక్క పూటలోనే ఏడుగురు ఉగ్రవాదుల భరతం పట్టిన భారత సైన్యం

ABN , First Publish Date - 2020-08-22T18:51:49+05:30 IST

శనివారం.... పైగా వినాయక చవితి. ఈ ఒక్క రోజే ఏడుగురు ఉగ్రవాదుల భరతం పట్టారు భారత జవాన్లు.

ఒక్క పూటలోనే ఏడుగురు ఉగ్రవాదుల భరతం పట్టిన భారత సైన్యం

న్యూఢిల్లీ : శనివారం.... పైగా వినాయక చవితి. ఈ ఒక్క రోజే ఏడుగురు ఉగ్రవాదుల భరతం పట్టారు భారత జవాన్లు. మొదట్ట మొదట ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈ వేట ప్రారంభమైంది. ఐసిస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ధౌలా కువాన్, కరోల్ బాగ్ మధ్య ఉన్న రిడ్జ్ రోడ్ లో జరిగిన ఎదురు కాల్పుల తర్వాత ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేశామని ప్రత్యేక బృందం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకొని, మిగితా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


ఇక రెండో సంఘటన...

అక్రమ చొరబాటుదార్ల రూపంలో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల్ని ఏక బిగిన మట్టుబెట్టడం. ఈ సంఘటన పంజాబ్‌లోని తర్నాతరణ్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతం నుంచి ఐదుగురు అక్రమ చొరబాటుదార్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించి... అలర్ట్ అయిన సైన్యం.. అక్కడికక్కడే మట్టుబెట్టేసింది. ఈ ఐదుగురూ పాక్ తీవ్రవాదులేనని అధికారులు పేర్కొన్నారు.


ఇలా అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించే క్రమంలో లొంగిపోవాలని బీఎస్‌ఎఫ్ జవాన్లు వారిని కోరామని అధికారులు తెలిపారు. అయినా సరే ఆ అక్రమ చొరబాటు దారులు వినకపోవడంతో వారిపై కాల్పులు ప్రారంభించామని, ఐదుగురు మరణించారని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరి దగ్గరి నుంచి ఏకె -47తో పాటు ఆయుధాలతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


ఇక మూడో ఘటన...

బారాముల్లాలో జరిగింది. కశ్మీర్ లోని బారాముల్లాలో ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సలూసా ప్రాంతంలోని క్రీరీలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లోనే ఉగ్రవాదిని మట్టుబెట్టారు జవాన్లు. ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని ఉన్నతాధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-08-22T18:51:49+05:30 IST