రామ మందిర నిర్మాణం ప్రారంభమైనట్లు ప్రకటన.. ప్రత్యేకతలేంటంటే..
ABN , First Publish Date - 2020-08-20T19:31:11+05:30 IST
అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గురువారం ప్రకటించింది.

లక్నో : అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గురువారం ప్రకటించింది. భారతీయ సనాతన, ప్రాచీన నిర్మాణ పద్ధతుల్లోనే నిర్మిస్తామని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ట్రస్ట్ సభ్యుల సమావేశం గురువారం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా ఈ మందిర నిర్మాణం ఉంటుందని, ఇంజినీర్లు ఇప్పటికే మట్టిని పరీక్షించారని కూడా పేర్కొంది. ఈ రామ మందిర నిర్మాణం 36 నుంచి 40 నెలల్లో పూర్తవుతుందని ట్రస్ట్ ప్రకటించింది.
అయితే ఈ ఆలయ నిర్మాణంలో అసలు ఇనుమును ఉపయోగించమని ట్రస్ట్ ప్రకటించింది. ఈ నిర్మాణంలో వాడే రాళ్ల మధ్యలో 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు ఉన్న రాగి పలకలను వాడతామని, వీటిని భారీ సంఖ్యలో దానం చేయాలని రామ భక్తులకు పిలుపునిస్తామని ట్రస్ట్ పేర్కొంది. ఆ రాగి పలకలపై దాతలు తమ పేర్లు కూడా రాసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని, ఇలా రాగి పలకలను దానం చేయడం జాతి ఐక్యతకు సంకేతమని పేర్కొంది.