వారి బాధ్యత మీదే!

ABN , First Publish Date - 2020-05-13T13:10:37+05:30 IST

ఢిల్లీ నుంచి చెన్నై రానున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణికులను క్వారంటైన్‌లో వుంచే బాధ్యత రైల్వేశాఖ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ, రైల్వేశాఖ మంత్రులకు లేఖ రాశారు.

వారి బాధ్యత మీదే!

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నుంచి చెన్నై రానున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణికులను క్వారంటైన్‌లో వుంచే బాధ్యత రైల్వేశాఖ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ, రైల్వేశాఖ మంత్రులకు లేఖ రాశారు. సోమవారం ప్రధాని మోదీతో జరిపిన చర్చల సందర్భంగా ఈనెల 31 వరకూ చెన్నైకి రైలు సర్వీసులు నడపరాదని ఎడప్పాడి సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 14, 16 తేదీల్లో ఢిల్లీ నుంచి చెన్నైకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను నడుపనున్నారు. ఈ రైళ్ళకు ఇంతకు ముందే టికెట్లు రిజర్వేషన్లు చేసుకోవడం వల్ల ఆ రెండు రైళ్ళను నడపాల్సి వచ్చిందని కేంద్రం రాష్ట్రానికి తెలియజేసింది. ఈ వివరాలను పరిశీలించిన మీదట హోం, రైళ్వ శాఖ మంత్రులకు సీఎం ఎడప్పాడి లేఖ రాశారు. ఆ రెండు రైళ్లలో ఏసీ బోగీలలో సుమారు 1100 మంది ప్రయాణికులు వస్తుండటంతో వారికి కరోనా సోకే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ రెండు రైళ్ళలో వచ్చే ప్రయాణికులకు ఒకే సమయంలో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరుపటం కష్టసాధ్యమని, అందువలన రైల్వే శాఖ ఆ ప్రయాణికులందరినీ వేర్వేరు ప్రాంతాల్లో బసచేయించాలని, తరవాఆత  రాష్ట్ర ప్రభుత్వం వారికి పరీక్షలు చేయిస్తుందని ఎడప్పాడి తెలిపారు. పరీక్షలలో కరోనా పాజిటివ్‌లున్నవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తామని, నెగిటివ్‌ వచ్చిన వారిని రైల్వే శాఖ అధికారులే క్వారంటైన్‌లో ఉంచాలని ఎడప్పాడి ఆ లేఖలో సూచించారు.

Updated Date - 2020-05-13T13:10:37+05:30 IST