రేపు కఠిన లాక్డౌన్: దుకాణాల బంద్
ABN , First Publish Date - 2020-08-22T15:41:20+05:30 IST
రేపు కఠిన లాక్డౌన్: దుకాణాల బంద్
చెన్నై: రాష్ట్రంలో ఆదివారం కరోనా కఠిన లాక్డౌన్ అమలు కానుంది. కొవిడ్-19 కరోనా వైరస్ను నియంత్రించే దిశగా తొలుత గత మార్చి 21వ తేదీ ఆదివారం కఠిన లాక్ డౌన్ను ప్రభుత్వం విధించింది. ఆ తరువాత పలువిడతలుగా మరికొన్ని సడలింపులతో లాక్డౌన్ 2.0లో జూలై నెలలో అన్ని ఆదివారాలు కఠిన లాక్డౌన్ అమలు చేసింది. అదే క్రమంలో లాక్డౌన్ 3.0లో నిబంధనలు సడలించినప్పటికీ, ఈనెల 31వ తేదీ వరకు ఆదివారాల్లో జనతా కర్ఫ్యూను పాటించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ దిశగా ఆదివారం కఠిన లాక్డౌన్ అమలు కానుంది. పాల దుకాణాలు, మందుల షాపులు మినహా అన్ని దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు మూతపడనున్నాయి. అంబులెన్స్, అత్యవసర వైద్యసేవలకు వెళ్లే వాహనాలను మాత్రమే రహదారుల్లో సంచరిం చేందుకు అనుమతిస్తారు. ఆటోలు, టాక్సీలు, వ్యాన్లు, లారీలు తదితర వాహనాల సంచారాన్ని అనుమ తించరు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నగరంలో 200 చోట్ల ట్రాఫిక్ పోలీసులు నిఘా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రహదారుల్లో అనవసరంగా సంచరించేవారిని, ముఖాలకు మాస్కులు ధరించకుండా వచ్చేవారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని నగర పోలీసులు కమిషనర్ మహేశ్కుమార్ అగర్వాల్ హెచ్చరించారు.
మార్కెట్లలో పెరిగిన రద్దీ
ఆదివారం కఠిన లాక్డౌన్ అమలుకానున్న నేపథ్యంలో అన్ని మార్కెట్లు జనంతో కిటకిట లాడాయి. నిత్యావసర వస్తువులు కొనుగోలుకు ప్రజలు పెద్దసంఖ్యలో దుకాణాల ముందు బారులుతీరారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దుకాణ యజమానులు చెప్పినా ఎవరూ వినలేదు. చింతాద్రిపేట చేపల మార్కెట్, జామ్బజార్లో చికెన్, మటన్ షాపుల వద్ద ఉదయం నుంచి కొనుగోలుదారుల రద్దీ అధికమైంది. రాయపురం చేపలరేవు వద్ద ఎప్పటి వలెనే చేపల కోసం వేల సంఖ్యలో నగరవాసులు గుమికూడారు.