పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రారంభమెప్పుడు?

ABN , First Publish Date - 2020-08-22T15:36:06+05:30 IST

పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రారంభమెప్పుడు?

పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రారంభమెప్పుడు?

చెన్నై: మహోన్నత పాఠశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఎప్పుడు ప్రారంభిస్తారనే అనే విషయమై బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా టెన్త్‌ పరీక్షలు రద్దుచేసిన ప్రభుత్వం, విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. త్రైమాసిక, అర్ధ వార్షిక, విద్యార్థుల హాజరు శాతం ఆధారంగా మార్కుల జాబితాను అందజేసింది. పాఠశాలలకు రాకుండా ప్రైవేటుగా టెన్త్‌ పరీక్షలు రాసేందుకు హాల్‌టిక్కెట్లు పొందిన ప్రైవేటు విద్యార్థులు కూడా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కోయంబత్తూర్‌కు చెందిన వరుణ్‌కుమార్‌ అనే ప్రైవేటు విద్యార్థి తండ్రి ఎస్‌.బాలసుబ్రమణ్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ప్లస్‌ వన్‌, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిందని, టెన్త్‌ ప్రైవేటు అభ్యర్థుల విషయమై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, వారు ఆయా కోర్సుల్లో చేరేలా, వారి పరీక్షల వ్యవహారం వెలువడే వరకు అడ్మిషన్లు నిలిపివేయాలని, టెన్త్‌లో ప్రైవేటు విద్యార్థులు కూడా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించి, మార్కుల జాబితా అందజేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్‌, ఆర్‌.హేమలతలతో కూడిన బెంచ్‌ శుక్రవారం విచారించింది. పిటిషన్‌దారుడి తరఫున హాజరైన న్యాయవాది, టెన్త్‌ ప్రైవేటు అభ్యర్థులకు సెప్టెంబరు 21 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించందని, ఫలితాలు వచ్చేందుకు మరో నెలరోజులు పడుతుందన్నారు. అలాంటప్పుడు ఈనెల 24వ తేఈ నుంచి ప్రారంభమయ్యే అడ్మిషన్లకు ప్రైవేటు విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకుంటారని వాదించారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ, మహోన్నత పాఠశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను ఎప్పుడు ప్రారంభిస్తారో బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-08-22T15:36:06+05:30 IST