పది రోజుల్లో కరోనా రహితంగా చెన్నై
ABN , First Publish Date - 2020-05-17T13:37:30+05:30 IST
పది రోజుల్లో కరోనా రహితంగా చెన్నై
చెన్నై, (ఆఃద్రజ్యోతి): ప్రస్తుతం కరోనా రెడ్జోన్గా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న రాజధాని నగరం చెన్నైని పది రోజుల్లోగా ఆ వైరస్ వ్యాప్తి లేని నగరంగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని కరోనా నిరోధక విభాగం ప్రత్యేక అధికారి, రెవిన్యూశాఖ కమిషనర్ జె.రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
ఆ మూడుజోన్లపై ప్రత్యేక దృిష్టి
చెన్నై నగరంలో కరోనా వ్యాప్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాయపురం, కోడంబాక్కం, తిరువికనగర్ జోన్లలో ఆ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. కోడంబాక్కం జోన్ 127వ వార్డు సీమాతమ్మన్ కోవిల్ వీధిలో రాధాకృష్ణన్ పర్యటించి స్థానికులకు నీలవేము కషాయం, కబసుర పానీయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో నకిలీ కబసుర పానీయం, నీలవేము కషాయం పంపిణీ చేస్తున్నట్టు తెలిసిందని, ఆ విధంగా కల్తీచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే నగరవాసులు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించా లన్నారు. ఆ తర్వాత ఆటోల్లో కబసుర పానీయం, నీలవేము కషాయం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇదే విధంగా షోళింగనల్లూరు జోన్లోని కణ్ణగినగర్, ఎళిల్నగర్ తదితర ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. స్థానికులకు కబసురపానీయం, ఉచిత మాస్కులు అందించారు. కరోనా పరీక్షలను వేల సంఖ్యలో చేయడం వల్లే రోజూ వందల సంఖ్యలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటినా మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.