అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులపై లాఠీచార్జ్
ABN , First Publish Date - 2020-04-28T20:24:25+05:30 IST
కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులపై వాటర్ కేన్స్ను ప్రయోగించారు. అయినా వినకపోవడంతో

అంబాలా: కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులపై వాటర్ కేన్స్ను ప్రయోగించారు. అయినా వినకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. వివరాల్లోకెళితే.. చందాపూర్ గ్రామంలో ఓ వృద్దురాలు శ్వాస సంబంధిత ఇబ్బంది ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె అంత్యక్రియలను తమ స్వంత స్థలంలో నిర్వహించాలని మృతురాలి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే గ్రామస్తులు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతురాలు కరోనాతో మృతిచెంది ఉండొచ్చనే అనుమానంతో ఆమె అత్యంక్రియలకు అడ్డుతగిలారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తే కరోనా తమకు కూడా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడం లాఠీఛార్జ్ చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు, అధికారుల సమక్షంలో మృతురాలి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన సందర్భంగా పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ అభిషేక్ జోర్వాల్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.