ఆరు నూరైనా సీఎం అభ్యర్థి నితీశే : సుశీల్ మోదీ

ABN , First Publish Date - 2020-10-07T15:34:14+05:30 IST

సీఎం నితీశ్ దూకుడును తగ్గించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఓ క్లారిటీ

ఆరు నూరైనా సీఎం అభ్యర్థి నితీశే : సుశీల్ మోదీ

పాట్నా : సీఎం నితీశ్ దూకుడును తగ్గించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఆరు నూరైనా నితీశే తమ సీఎం అభ్యర్థి అని ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ప్రకటించారు. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ముందుకు తెస్తుందన్న వార్తలను ఆయన ఖండించారు.


‘‘మా సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే. సంఖ్యల పరంగా ఫలితం ఏదైనా కావచ్చు. సీఎం అభ్యర్థిత్వం విషయంలో మేము చిరాగ్ ను ప్రోత్సహించలేదు. ఎన్డీఏలో ఎవరు భాగస్వామ్యులున్నా.... నితీశ్ కుమార్‌నే సీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సిందే.’’ అని సుశీల్ మోదీ తేల్చి చెప్పారు.




చిరాగ్ పాశ్వాన్ ప్రతిరోజూ నితీశ్ కుమార్ పై విరుచుకుపడుతున్నా.... బీజేపీ కిమ్మనడం లేదని సమావేశంలో జేడీయూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఇంత నికచ్చిగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నితీశ్ ను శాంతపరచడానికి మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు. ఎన్డీయేలో ఉన్న నాలుగు పార్టీలు మాత్రమే ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకోవాలని, లేదంటే తాము నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పరోక్షంగా చిరాగ్‌ ను సుశీల్ మోదీ హెచ్చరించారు. 

Updated Date - 2020-10-07T15:34:14+05:30 IST