సుశాంత్ కేసులో రంగంలోకి ఈడీ
ABN , First Publish Date - 2020-08-01T08:43:24+05:30 IST
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు

న్యూఢిల్లీ, జూలై 31: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బిహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైంది. సుశాంత్ సింగ్ను ఆయన గర్ల్ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చంటూ సుశాంత్ తండ్రి కృష్ణకుమార్ సింగ్ ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
మనీలాండరింగ్ వ్యవహారాలు కూడా జరిగినట్టు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ ఖాతాలో ఉన్న రూ.15 కోట్లు ఎక్కడికి బదిలీ అయ్యాయో నిగ్గుతేల్చాలని కోరారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆదాయం, బ్యాంకు ఖాతాలు, కంపెనీల వివరాలు సేకరించిన ఈడీ.. ఎఫ్ఐఆర్ను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. నిందితుల్లో రియా, ఆమె కుటుంబ సభ్యులు, మరో ఆరుగురున్నారు. కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్ర మంత్రి రామ్విలాస్ పాసవాన్ డిమాండ్ చేశారు. సుశాంత్ నిరాశా నిస్పృహలతో ఆత్మహత్య చేసుకున్నాడంటే తాను ఎప్పుడూ నమ్మనని ఆయన మాజీ ప్రియురాలు, టీవీ నటి అంకిత లోఖండే అంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి మౌనం వీడారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు.