ఆంధ్ర రాజధాని అమరావతే‘!
ABN , First Publish Date - 2020-08-20T07:39:48+05:30 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ‘అమరావతి‘ని గుర్తిస్తూ.. భారత పటం (మ్యాప్)లో అధికారికంగా చేర్చామని సర్వే ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టీకరించింది...

- భారత మ్యాప్లో చేర్చాం.. సర్వే ఆఫ్ ఇండియా పునరుద్ఘాటన
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ‘అమరావతి‘ని గుర్తిస్తూ.. భారత పటం (మ్యాప్)లో అధికారికంగా చేర్చామని సర్వే ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టీకరించింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా నిరుడు నవంబరు 21న లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందిస్తూ.. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మ్యాప్లో గుర్తించినట్లు వెల్లడించింది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి చెందిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ సింగ్.. జయదేవ్కు అధికారికంగా ఈ నెల 18న లేఖ రాశారు.
ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఈ లేఖను విడుదల చే స్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై గల్లా ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని భారత మ్యాప్లో గుర్తించి, అప్డేట్ చేశామని సర్వే ఆఫ్ ఇండియా సుస్పష్టం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.