జస్టిస్‌ ధర్మాధికారి నివేదికపై తేల్చేస్తాం!

ABN , First Publish Date - 2020-11-19T09:42:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంలో జస్టిస్‌ ధర్మాధికారి ఇచ్చిన అంతిమ నివేదిక చట్టబద్ధమా? కాదా? అన్నది తేల్చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది...

జస్టిస్‌ ధర్మాధికారి నివేదికపై తేల్చేస్తాం!

  • స్పష్టం చేసిన సుప్రీం కోర్టు 


న్యూఢిల్లీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంలో జస్టిస్‌ ధర్మాధికారి ఇచ్చిన అంతిమ నివేదిక చట్టబద్ధమా? కాదా? అన్నది తేల్చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థలు, పలు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తెలంగాణ విద్యుత్‌ సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ధర్మాధికారి కమిటీని ఏపీ తప్పదోవపట్టిందని ఆరోపించారు. ఇచ్చిన ఉద్యోగుల లెక్కలను స్వతంత్రంగా నిర్ధారించుకోలేదని, తమ వాదనలను కూడా వినలేదని తెలిపారు. ఆర్థిక సమతుల్యత అనే కొత్త అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని, విధివిధానాల్లో ఈ అంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఎక్కడా లేదని తెలిపారు. కాగా, విభజన వివాదంలో ఉన్న 1,157 మంది ఉద్యోగుల్లో ఏపీకి కేటాయించిన వారిని చేర్చుకోబోమని ఏపీ విద్యుత్‌ సంస్థలు చేస్తున్న వాదన సరికాదన్నారు. తెలంగాణకు వస్తామని ఆప్షన్‌ ఇచ్చిన 502 మందికి అదనంగా ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన 450 మందిని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చేర్చుకున్నాయని తెలిపారు. వీరే కాకుండా అదనంగా 480 మందిని తెలంగాణకు కేటాయించారని కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ ధర్మాధికారి ఇచ్చిన అంతిమ నివేదికను పక్కనబెట్టాలని అభ్యర్థించారు.  


ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కేసు విడిగా విచారణ

ఏపీ విద్యుత్‌ సంస్థలు తమకు జారీ చేసిన రిలీవింగ్‌ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ రిలీవ్‌ చేసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. రిలీవింగ్‌ ఉత్తర్వులు సరైనవా? కావా? అనేది తేల్చుతామని తెలిపింది.


Updated Date - 2020-11-19T09:42:22+05:30 IST