రద్దయిన విమాన టిక్కెట్ల ధర తిరిగి చెల్లింపు పథకానికి సుప్రీంకోర్టు ఆమోదం

ABN , First Publish Date - 2020-10-01T20:33:56+05:30 IST

కోవిడ్-19 నిరోధానికి అమలు చేసిన అష్ట దిగ్బంధనానికి ముందు బుక్ చేసిన విమానాల టిక్కెట్ల ధరను ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని విమానయాన

రద్దయిన విమాన టిక్కెట్ల ధర తిరిగి చెల్లింపు పథకానికి సుప్రీంకోర్టు ఆమోదం

న్యూఢిల్లీ : కోవిడ్-19 నిరోధానికి అమలు చేసిన అష్ట దిగ్బంధనానికి ముందు బుక్ చేసిన విమానాల టిక్కెట్ల ధరను ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని విమానయాన సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 24 వరకు ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టిక్కెట్లు విమానయాన సేవలు రద్దయినందు వల్ల ప్రయాణికులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని ఆదేశించింది. 


అష్ట దిగ్బంధనం నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా రద్దయిన విమానాల టిక్కెట్ల ధరను తిరిగి చెల్లించడానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూపొందించిన ప్రణాళికను సుప్రీంకోర్టు గురువారం ఆమోదించింది. 


సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, విమానయాన సంస్థలు తమ వద్ద టిక్కెట్ తీసుకున్న ప్రయాణికుల పేరు మీద క్రెడిట్ షెల్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ సొమ్ముతో 2021 మార్చి 31లోగా ఏ మార్గంలోనైనా విమానయానం చేసే అవకాశం ప్రయాణికులకు కల్పిస్తారు. ఈ క్రెడిట్ షెల్‌ను వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు. టిక్కెట్‌ను రద్దు చేసుకున్న తేదీ నుంచి జూన్ 30 వరకు 0.5 శాతం వడ్డీ, జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు 0.75 శాతం వడ్డీని విమానయాన సంస్థలు చెల్లిస్తాయి. 


ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లయితే, వారి ద్వారానే ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తారని సుప్రీంకోర్టు చెప్పింది. 


మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో బుక్ చేసిన టిక్కెట్ల ధరను ప్రయాణికులకు తక్షణమే తిరిగి చెల్లించాలని డీజీసీఏ ఏప్రిల్ 16న ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు కొనసాగుతాయి. 


ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అష్ట దిగ్బంధనం విధించడానికి ముందు బుక్ చేసిన విమాన టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని కోరుతూ ప్రవాసీ లీగల్ సెల్, ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. 


Updated Date - 2020-10-01T20:33:56+05:30 IST