కోర్టు ధిక్కార చట్టంపై పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2020-08-13T21:54:03+05:30 IST

కోర్టు ధిక్కార చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

కోర్టు ధిక్కార చట్టంపై పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢిల్లీ : కోర్టు ధిక్కార చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ, సీనియర్ పాత్రికేయుడు ఎన్ రామ్ ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అధికారాన్ని భంగపరచడం నేరపూరిత ధిక్కారంగా పరిగణించే చట్ట నిబంధన రాజ్యాంగబద్ధత, చెల్లుబాటును వీరు తమ పిటిషన్‌లో ప్రశ్నించారు. 


ప్రశాంత్ భూషణ్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం సమక్షంలో మాట్లాడుతూ, ఇదే అంశంపై అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందువల్ల తాము తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే తాము కోరుకున్నపుడు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు, అంటే బహుశా రెండు నెలల తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 


ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ఉన్నారు. ఈ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ, తదుపరి సుప్రీంకోర్టు మినహా, ఇతర సరైన న్యాయ వేదికను ఆశ్రయించవచ్చునని తెలిపింది. 


కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 2(సీ)(i) రాజ్యాంగ బద్ధతను పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ నిబంధన వాక్ స్వాతంత్ర్యాన్ని, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 


Updated Date - 2020-08-13T21:54:03+05:30 IST