క్లస్టర్స్‌లో కఠినంగా లాక్‌డౌన్: సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2020-06-22T21:51:27+05:30 IST

కస్టర్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధికారాలను ..

క్లస్టర్స్‌లో కఠినంగా లాక్‌డౌన్: సీఎం ఆదేశం

బెంగళూరు: కస్టర్లలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధికారాలను ఆదేశించారు. బెంగళూరులో కోవిడ్-19 పరిస్థితిని మంత్రులు, సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారంనాడు సమీక్షించారు. బెంగళూరులో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున ముందస్తు చర్యలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


కస్టర్లలో ముఖ్యంగా కేఆర్ మార్కెట్, పరిసరాల్లోని సిద్దపుర, వీవీ పురం, కలసిపాళ్య తదితర ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నందున కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని సీఎం సూచించారు. క్వారంటైన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. కరోనా చికిత్స అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్దిష్ట రేట్లు అమలు చేసేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో క్వారంటైన్లలో ఉన్నవారికి కనీస సౌకర్యాలు కల్పించాలని, అన్ని వార్డుల్లో ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. ఇటీవలే తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనందున వాటికి విఘాతం కలుగకుండా కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలు, సౌకర్యాలను కోవిడ్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, తద్వారా పేషెంట్లు ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స తీసుకునేందుకు వెలుసుబాటు అవుతుందని యడ్యూరప్ప సూచించారు.

Updated Date - 2020-06-22T21:51:27+05:30 IST