సైన్యాన్ని అవమానించడం మానుకోండి.. మన్మోహన్ సింగ్పై నడ్డా ఫైర్
ABN , First Publish Date - 2020-06-22T21:13:07+05:30 IST
సైనికులను అవమానించే విధంగా మాట్లాడడం మానుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు..
![సైన్యాన్ని అవమానించడం మానుకోండి.. మన్మోహన్ సింగ్పై నడ్డా ఫైర్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062203391856/06222020154304n27.gif)
న్యూఢిల్లీ: సైనికులను అవమానించే విధంగా మాట్లాడడం మానుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల శౌర్య, ప్రతాపాలను కించపరచడం కాంగ్రెస్కు గానీ, ఆ పార్టీ నేతలకు కానీ తగదని హితవు పలికారు. ‘మీరు ప్రధానిగా ఉన్న సమయంలో 2010 నుంచి 2013 మధ్య కాలంలో చైనా దాదాపు 600 సార్లు భారత భూభాగాలను ఆక్రమించింది. వందల కిలోమీటర్ల భూభాగం చైనా చేజిక్కించుకుంటున్నా కాంగ్రెస్ కానీ, అప్పటి ప్రధాని కానీ పట్టించుకోలేదు.
ఆ చర్యల ఫలితంగానే ఇప్పుడు ఈ పరిస్థితులు నెలకొన్నాయ’ని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ సమైక్యంగా ఉండాలని, దానికోసం పాటుపడాలని, రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా నిజమైన ఐకమత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని, దేశ సంరక్షణ కోసం చేతులు కలపాలని నడ్డా కోరారు.