హనీమూన్కు డబ్బులు పోగేసేందుకు కారు చోరీ... చివరికి...
ABN , First Publish Date - 2020-08-01T14:30:31+05:30 IST
రెండు వారాల క్రితం వివాహమైన ఒక యువకుడు తన భార్యతో హనీమూన్ వెళ్ళడానికి డబ్బు సమకూర్చుకునేందుకు ఒక లగ్జరీ కారును చోరీచేశాడు. అయితే ఆ వాహన యజమాని ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని...

న్యూఢిల్లీ: రెండు వారాల క్రితం వివాహమైన ఒక యువకుడు తన భార్యతో హనీమూన్ వెళ్ళడానికి డబ్బు సమకూర్చుకునేందుకు ఒక లగ్జరీ కారును చోరీచేశాడు. అయితే ఆ వాహన యజమాని ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని ఖ్యాలా పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని, అరెస్టు చేసి, తీహార్ జైలుకు తరలించారు. నిందితుడు రాహుల్తో పాటు అతని స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. లగ్జరీ కారు, స్కూటీ, మొబైల్ ఫోన్, బటన్-అప్ కత్తి మొదలైనవాటిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులపై ఇప్పటికే 15కి పైగా వాహన చోరీ కేసులు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగిలించిన వాహనాన్ని విక్రయించడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఖ్యాలా పోలీస్ స్టేషన్కు సమాచారం అందిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దీపక్ పురోహిత్ తెలిపారు. ఈ కారు చోరీపై కొద్దిరోజుల క్రితం ఖ్యాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితుల కోసం నిఘా వేసి, వారిని పట్టుకుని, అరెస్టు చేశారు. కాగా రెండు వారాల క్రితం తాను వివాహం చేసుకున్నానని నిందితుడు రాహుల్ పోలీసులకు తెలిపాడు. భార్యతో పాటు కులు-మనాలికి వెళ్లాలని అనుకున్నామని, డబ్బులు లేకపోవడంతో కారు దొంగిలించామని పేర్కొన్నాడు.