నిర్ణయాధికారం మాదే... మమ్మల్ని నమ్మండి : మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2020-09-03T13:27:20+05:30 IST

కేంద్రం అనుమతి లేకుండా లాక్‌డౌన్ విధించరాదన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

నిర్ణయాధికారం మాదే... మమ్మల్ని నమ్మండి : మమతా బెనర్జీ

కోల్‌కతా : కేంద్రం అనుమతి లేకుండా లాక్‌డౌన్ విధించరాదన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం నిర్ణయాలను వెల్లడిస్తే సరిపోదని కేంద్రానికి చురకలంటించారు. నిర్ణయాలను అమలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, రాష్ట్రాలను విశ్వసనీయతలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. సెప్టెంబర్ 7,11,12 తేదీల్లో లాక్‌డౌన్ ఉంటుందని ఇప్పటికే తాము ప్రకటించామని, ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్ లో లాక్‌డౌన్ ఉంటుందని, ఈ సమాచారాన్ని హోంశాఖకు కూడా చేర వేశామని ఆమె స్పష్టం చేశారు.


‘‘ఆదేశాలను జారీ చేయగానే సరిపోదు. నిర్ణయాలను అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి’’  అని మమతా పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకే ఎక్కువ అవగాహన ఉంటుందని, ఏఏ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలన్నది వారికే ఎక్కువగా తెలుసని అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి తల్లిదండ్రుల పాత్ర అని, ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలని, అయినా ఇద్దరూ ప్రజలచే ఎన్నికైన వారేనని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-03T13:27:20+05:30 IST