కరోనా లాక్‌డౌన్.. తాత్కాలిక జైలుగా మొహాలీ స్టేడియం..

ABN , First Publish Date - 2020-04-07T23:23:07+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర విధించిన లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిని ఉంచేందుకు మొహాలీ 11వ ఫేజ్‌లో ఉన్న అంతర్జాతీయ హకీ స్టేడియంను

కరోనా లాక్‌డౌన్.. తాత్కాలిక జైలుగా మొహాలీ స్టేడియం..

మొహాలీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర విధించిన లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిని ఉంచేందుకు మొహాలీ 11వ ఫేజ్‌లో ఉన్న అంతర్జాతీయ హకీ స్టేడియంను తాత్కాలిక జైలుగా అధికారులు మార్చేశారు. 


లాక్‌డౌన్ నిబంధన అమలులో ఉన్నంతకాలం ఈ స్టేడియంను జైలుగా ఉపయోగిస్తామని డిప్యూటీ కమిషనర్ గిరీశ్ దీన్‌దయాల్ తెలిపారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జిల్లాలోని ప్రతీ మూలలోనూ పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్పిన ఆయన.. ఇళ్ల నుంచి బయటకు వచ్చి కర్ఫ్యూని ఉల్లంఘించాలని ప్రయత్నించే వారిపై ఓ కన్నేసి ఉంచామని తెలిపారు. 


ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 289 కర్ఫ్యూ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, 391 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాక.. 410 వాహనాలను సీజ్ చేశారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపై తిరగాలని ప్రయత్నించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎఫ్‌ఆర్ నమోదు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశామని సీనియర్ ఎస్పీ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు. 

Updated Date - 2020-04-07T23:23:07+05:30 IST