శ్రీనగర్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బీజేపీ కార్యకర్తలు
ABN , First Publish Date - 2020-08-05T21:00:38+05:30 IST
బీజేపీ కార్యకర్తలు జమ్మూ-కశ్మీరులో చాలా చోట్ల భారత పతాకాన్ని ఎగురవేసి, అధికరణ
శ్రీనగర్ : బీజేపీ కార్యకర్తలు జమ్మూ-కశ్మీరులో చాలా చోట్ల భారత పతాకాన్ని ఎగురవేసి, అధికరణ 35ఏ, అధికరణ 370ల రద్దు వార్షికోత్సవాలను జరుపుకున్నారు.
ఈ అధికరణలను గత ఏడాది ఆగస్టు 5న భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ కార్యకర్తలు శ్రీనగర్లోని పార్టీ కార్యాలయంలోనూ, మరికొన్ని చోట్ల భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ, అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీరులో అభివృద్ధి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోందన్నారు. చాలా కాలం నుంచి రాళ్ల దాడులు జరగడం లేదన్నారు. బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యులకు తమ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం కోసం రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోందన్నారు. కశ్మీరు లోయలో అన్ని ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
అధికరణ 370 రద్దు వార్షికోత్సవాలను బీజేపీ కార్యకర్తలు అనంత్నాగ్, గండేర్బల్, కుప్వారా జిల్లాల్లో కూడా నిర్వహించారు. భారత పతాకాన్ని ఎగురవేసి, ‘‘భారత్ మాతా కీ జై’’ అంటూ నినాదాలు చేశారు.
జమ్మూ-కశ్మీరుకు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.