స్పెయిన్లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజులోనే 832 మంది బలి
ABN , First Publish Date - 2020-03-28T23:44:30+05:30 IST
కరోనా మహమ్మారి ఇప్పుడు స్పెయిన్లో విలయతాండం చేస్తోంది. అక్కడ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి
![స్పెయిన్లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజులోనే 832 మంది బలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032806105241/03282020181330n1.jpg)
మాడ్రిడ్: కరోనా మహమ్మారి ఇప్పుడు స్పెయిన్లో విలయతాండం చేస్తోంది. అక్కడ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే ఏకంగా 832 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్లో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. శుక్రవారం ఇక్కడ ఒక్క రోజులోనే 769 మంది మరణించారు. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. తాజా మరణాలతో స్పెయిన్లో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,690కి చేరుకుంది. అలాగే, గత 24 గంటల్లో 8 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. స్పానిష్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 72,248 మంది కరోనా వైరస్ బారినపడగా, 40,630 మంది ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంది. 4,575 మందిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. 12,285 మంది కరోనా నుంచి కోలుకున్నారు. స్పెయిన్తో పోలిస్తే ఇటలీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ గురువారం- శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా 969 మంది ప్రాణాలు కోల్పోయారు.