సీఓపీడీ రోగుల పర్యవేక్షణకు ‘స్మార్ట్ మాస్క్’
ABN , First Publish Date - 2020-09-12T07:21:54+05:30 IST
శ్వాసకోశ రోగులపై కరోనా విరుచుకుపడుతున్న సంక్లిష్ట తరుణంలో ఐఐటీ ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు.

కోల్కతా, సెప్టెంబరు 11: శ్వాసకోశ రోగులపై కరోనా విరుచుకుపడుతున్న సంక్లిష్ట తరుణంలో ఐఐటీ ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. శ్వాస సమస్య, నిరంతర దగ్గు, అలసట వంటి సమస్యలతో కూడిన క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)తో సతమతమయ్యే రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే స్మార్ట్ మాస్క్ను వారు అభివృద్ధిచేశారు. ‘సెన్ ఫ్లెక్స్-టీ’ అని పేరు పెట్టిన ఆ మాస్క్ ధర దాదాపు రూ.2,500 ఉండొచ్చని చెబుతున్నారు. ఇది బ్లూటూత్ ద్వారా ఓ యాండ్రాయిడ్ మానిటరింగ్ యాప్కు అనుసంధానమై ఉంటుంది. శ్వాసలో చోటుచేసుకునే మార్పులు, గుండె కొట్టుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ సంతృప్త స్థాయి వంటి అంశాలను ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఈ వివరాలు మాస్క్ నుంచి యాప్కు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వర్కు చేరుతాయి. అక్కడ ఉండే కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్ వాటిని విశ్లేషించి సీఓపీడీ తీవ్రత ఏ స్థాయిలో ఉందనే దానిపై యాప్కు సందేశాన్ని పంపుతుంది.