వ్యవసాయ సంస్కరణలతో సన్నకారు రైతులకు మేలు : మోదీ

ABN , First Publish Date - 2020-09-25T20:17:55+05:30 IST

వ్యవసాయ సంస్కరణల వల్ల చిన్నకారు, సన్నకారు రైతులకు అత్యధిక మేలు జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

వ్యవసాయ సంస్కరణలతో సన్నకారు రైతులకు మేలు : మోదీ

న్యూఢిల్లీ : వ్యవసాయ సంస్కరణల వల్ల చిన్నకారు, సన్నకారు రైతులకు అత్యధిక మేలు జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలోని రైతుల్లో 85 శాతం మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 


దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంత్యుత్సవాల సందర్భంగా మోదీ శుక్రవారం బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు చిన్నకారు, సన్నకారు రైతులకు ప్రయోజనకరమని, దేశంలోని రైతుల్లో 85 శాతం మంది ఈ వర్గానికి చెందినవారేనని, వారందరూ ఈ సంస్కరణల పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. 


తాము పండించిన పంటల ధరలపై నిర్ణయం తీసుకోగలిగే అవకాశం రైతులకు రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. మండీలలో వ్యవసాయోత్పత్తులను అమ్ముకునే సంప్రదాయం ఉందని, ఏ రైతు అయినా మండీలో అమ్మకుండా వేరొక చోట అమ్ముకోవాలని కోరుకుంటే, ఆ విధంగా చేయవచ్చునని చెప్పారు. రైతులు తమకు నచ్చినట్లుగా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని చెప్పారు. 


బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యత

క్షేత్ర స్థాయిలో రైతులకు అర్థమయ్యే విధంగా తేలికైన భాషలో నూతన వ్యవసాయ సంస్కరణల గురించి తెలియజేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నూతన వ్యవసాయ సంస్కరణల ప్రాధాన్యం, సంక్లిష్టతల గురించి వివరించాలని చెప్పారు. ఈ సంస్కరణలు రైతులను ఏవిధంగా సాధికారులను చేయగలవో చెప్పాలన్నారు. మనం క్షేత్రస్థాయిలో అనుసంధానం ఏర్పరచుకుంటే, వర్చువల్ వరల్డ్‌లో వ్యాపిస్తున్న అబద్ధాలు, వదంతులను బయటపెట్టవచ్చునని తెలిపారు. 


గత ప్రభుత్వాలు చేసే చట్టాలు రైతులకు అర్థంకాని రీతిలో ఉండేవని తెలిపారు. గత ప్రభుత్వాలు సంక్లిష్టమైన సాలెగూడు వంటి హామీలను గుప్పించేవని ఎద్దేవా చేశారు. 


Updated Date - 2020-09-25T20:17:55+05:30 IST