మేజిస్ట్రేట్ ఆఫీసుపై దాడి.. మాస్టర్మైండ్ ఎవరో తెలిస్తే షాక్..
ABN , First Publish Date - 2020-02-08T23:26:34+05:30 IST
మధ్యప్రదేశ్లోని ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీసుపై దాడి చేసిన ఘటనలో నిందితులెవరో తెలిసి పోలీసులే షాకయ్యారు.

భోపాల్: మధ్యప్రదేశ్లోని ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీసుపై దాడి చేసిన ఘటనలో నిందితులెవరో తెలిసి పోలీసులే షాకయ్యారు. ఎందుకంటే ఈ దాడి వెనుక మాస్టర్మైండ్ అక్కడి సబ్ డివిజనల్ మేజిస్ట్రేటే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛతార్పూర్లో కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అభయ్ సింగ్ భదేరియా అనే వ్యక్తి అనుమతులు పొందాడు. అయితే స్థానికంగా ఉన్న శ్రీకృష్ణ వర్సిటీ చైర్మన్కు ఈ వార్త మింగుడుపడలేదు. దీంతో తన మిత్రుడు, ఛతార్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనిల్ సప్కాలే సాయం కోరాడు. వీరికి బీజేపీ మైనారిటీ సెల్ కార్యదర్శి జావేద్ అక్తర్ కూడా తోడు కలిశాడు. వీరంతా కలిసి వర్సిటీ ప్రారంభించనున్న అభయ్సింగ్ను ఇరికించాలని పథకం వేశారు. దీని ప్రకారమే బుధవారం ఉదయాన్నే డిస్ట్రిక్ట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీసుపై కొందరు దుండగులతో దాడి చేయించారు. అదే విధంగా అనిల్ సప్కాలే వాహనాన్ని కూడా ధ్వంసం చేయించారు. ఇదంతా చేయించింది అభయ్సింగేనంటూ కేసు పెట్టారు. అయితే ఈ నిజం ఎక్కువ కాలం దాగలేదు. పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా నిజాలన్నీ బయటపడ్డాయి. ఈ పథకం రూపకర్త అనిలేనని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అనిల్, పుష్పేంద్ర సింగ్ గౌతమ్, జావేద్ అక్తర్తోపాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు తెలియజేశారు.