వైన్ షాపులపై రాజ్ థాకరేకు శివసేన కౌంటర్..
ABN , First Publish Date - 2020-04-25T20:08:29+05:30 IST
ఆదాయం పెంచుకునేందుకు మహారాష్ట్రలో వైన్ షాపులు తిరిగి తెరవాలంటూ ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే చేసిన డిమాండ్కు శివసేన ..

ముంబై: ఆదాయం పెంచుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వైన్ షాపులు తిరిగి తెరవాలంటూ ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే చేసిన డిమాండ్కు శివసేన శనివారంనాడు గట్టి కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర ఖజానాపై నిజంగానే ఆయనకు ఆందోళన ఉందా అని ప్రశ్నించింది. లాక్డౌన్ కారణంగా వైన్ షాపులే కాకుండా లిక్కర్ ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయని విషయం రాజ్ థాకరే తెలుసుకుంటే మంచిదని చురకలు వేసింది.
'దుకాణాలు తెరిచినంత మాత్రాన ఆదాయం రాదు. ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లు లిక్కర్ కొనుగోలు చేసినప్పుడు ఎక్సైజ్, సేల్స్ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. యూనిట్లు (ఫ్యాక్టరీలు) తెరవాలంటే వర్కర్లు అవసరం. అదీగాక, దుకాణాలు తిరిగి తెరిస్తే సామాజిక దూరం కూడా పాటించరు' అని శివసేన పత్రిక 'సామ్నా' తాజా సంపాదకీయంలో పేర్కొంది.
రాజ్థాకరే గత గురువారంనాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాస్తూ, వైన్షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందువల్ల ఆల్కహాల్ తీసుకునే వారి అవసరాలు తీరడంతో పాటు కష్టకాలంలో ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వస్తుందని ఆయన సూచించారు.