ఎంపీ సీఎంగా నాలుగోసారి శివరజ్‌!

ABN , First Publish Date - 2020-03-24T09:22:42+05:30 IST

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలల్లోపు...

ఎంపీ సీఎంగా నాలుగోసారి శివరజ్‌!

  • గవర్నర్‌ని కలిసిన అరగంటకే..
  • చౌహాన్‌కు మోదీ, అమిత్‌, నడ్డా అభినందనలు


భోపాల్‌, మార్చి 23: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలల్లోపు ఆయన తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పటికే ఎంపీ ముఖ్యమంత్రిగా మూడు విడతలు పనిచేసిన శివరాజ్‌ నాలుగోసారి బాధ్యతలు చేపట్టడం కూడా ఒక రికార్డే. సోమవారం రాత్రి 9 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన నిరాడంబర కార్యక్రమంలో గవర్నర్‌ లాల్జీ టండన్‌ ఆయనచేత ప్రమాణం చేయించారు.


వచ్చే వారంలోగా ఆయన తన కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. అంతకముందు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బీజేపీ శాసనసభా పార్టీ నేతగా ఎన్నికయ్యారు. చౌహాన్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన అరగంటకే  ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కమల్‌నాథ్‌(కాంగ్రెస్‌), బీజేపీ నాయకురాలు ఉమా భారతి హాజరయ్యారు. అంతకుముందు సీనియర్‌ ఎమ్మెల్యే గోపాల్‌ భార్గవ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. చౌహాన్‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-03-24T09:22:42+05:30 IST