రోగులకు చికిత్స అందించని ఆసుపత్రులకు సర్కారు షోకాజ్ నోటీసు
ABN , First Publish Date - 2020-04-15T16:32:29+05:30 IST
కరోనా హాట్ స్పాట్ ప్రాంతం నుంచి వచ్చిన రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరించిన రెండు ప్రైవేటు ఆసుపత్రులకు రాజస్థాన్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు షోకాజ్ నోటీసు ...
![రోగులకు చికిత్స అందించని ఆసుపత్రులకు సర్కారు షోకాజ్ నోటీసు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041511001533/04152020110222n55.gif)
జైపూర్ (రాజస్థాన్) : కరోనా హాట్ స్పాట్ ప్రాంతం నుంచి వచ్చిన రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరించిన రెండు ప్రైవేటు ఆసుపత్రులకు రాజస్థాన్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. జైపూర్ నగరంలోని రాంగంజ్ ప్రాంతానికి చెందిన ఓ రోగికి వైద్యచికిత్స చేసేందుకు నిరాకరించిన ఆసుపత్రులు మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ రాష్ట్ర వైద్యశాఖ సీఈఓ సూచీత్యాగి చెప్పారు. జైపూర్ నగరంలోని సీకే బిర్లా హాస్పిటల్, ఎస్డీఎం ఆసుపత్రులు రోగికి చికిత్స చేయడానికి నిరాకరించాయని త్యాగి జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రోగులకు వైద్యసేవలందించాలని వైద్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ అన్ని ఆసుపత్రులను ఆదేశించారు. వైద్యం అందించని రెండు ఆసుపత్రులపై తాము నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు చెప్పారు.