మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌పై బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : శివసేన

ABN , First Publish Date - 2020-10-07T22:21:33+05:30 IST

బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమవుతోంది. బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేపై అభ్యర్థిని నిలిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌పై బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : శివసేన

ముంబై : బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమవుతోంది. బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేపై అభ్యర్థిని నిలిపేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం మీద 50 స్థానాల నుంచి పోటీ చేసేందుకు శివసేన ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


గుప్తేశ్వర్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అనంతరం బిహార్ అధికార పార్టీ జనతా దళ్ (యునైటెడ్) (జేడీయూ)లో చేరారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 


ఈ నేపథ్యంలో బిహార్ శాసన సభ ఎన్నికల్లో గుప్తేశ్వర్ పాండేపై అభ్యర్థిని నిలపాలని నిర్ణయించినట్లు శివసేన ప్రకటించింది. శివసేన నేత అనిల్ దేశాయ్ విలేకర్లతో మాట్లాడుతూ, సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం గుప్తేశ్వర్ వాడుకున్నారని ఆరోపించారు. రాజ్‌పుట్ కేసులో ఆయన నాటకీయ ప్రవర్తనను మహారాష్ట్ర మాత్రమే కాకుండా యావత్తు దేశం చూసిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన జేడీయూలో చేరారని, బక్సర్ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పారు. ఓ సామాన్య శివ సైనికుడు ఆయనపై పోటీ చేసి, గట్టి పోటీ ఇస్తారని తెలిపారు. 


తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే అనుమతి పొందిన తర్వాత బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు అనిల్ తెలిపారు. 


ఈ ఎన్నికల్లో శివసేన సుమారు 50 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 


అక్టోబరు 28 నుంచి మూడు దశల్లో బిహార్ శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశ పోలింగ్ నవంబరు 3న, మూడో దశ పోలింగ్ నవంబరు 7న జరుగుతాయి. నవంబరు 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 



Updated Date - 2020-10-07T22:21:33+05:30 IST