శరద్ పవార్ చేసింది సరైనదే : శివసేన సమర్థన
ABN , First Publish Date - 2020-12-13T19:56:54+05:30 IST
శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించాలంటూ అన్ని రాష్ట్రాలనూ కోరడాన్ని శివసేన సమర్థించుకొంది

ముంబై : శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించాలంటూ అన్ని రాష్ట్రాలనూ కోరడాన్ని శివసేన సమర్థించుకొంది. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనే, శరద్ పవార్ రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చారని సామ్నాలో పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ‘చీకటి చట్టాలు’ అని శివసేన మండిపడింది. ఆ చట్టాలతో వ్యవసాయ భూములు కాస్త మరు భూములుగా మారతాయని, కొత్త చట్టాల ద్వారా రైతుల మరణాలు సంభవిస్తాయని అన్నారు. ‘‘రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పదేళ్ల క్రితం పవార్ సంస్కరణలను చేపట్టారు. అప్పటికి అదానీ, అంబానీ లేరు. గత ఆరేళ్లలోనే అంబానీ, అదానీ వ్యవసాయ మార్కెట్లలోకి వచ్చారు.’’ అని సామ్నా వేదికగా శివసేన చురకలంటించింది. రైతుల నిరసన రైతుల మానసిక స్థితిని ప్రతింబింబించడం లేదని కేంద్రం అర్థంపర్థం లేని వాదనలు చేస్తోందని, భారత్ బంద్ దానికి విరుద్ధమైన సంకేతాలిచ్చిందని శివసేన పేర్కొంది.