షిర్డీ సాయి ఆలయ దర్శనానికి మార్గదర్శకాలివే...
ABN , First Publish Date - 2020-11-15T22:10:40+05:30 IST
మార్చిలో కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన రాష్ట్రంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి తెరుస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్...

ముంబై: షిర్డీలోని ప్రఖ్యాత సాయిబాబా మందిరాన్ని ఈనెల 16 నుంచి భక్తులు సందర్శించుకోవచ్చు. గత మార్చిలో కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన రాష్ట్రంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి తెరుస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, కోవిడ్ హెచ్చరికలు కూడా చేశారు. కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్న విషయాన్ని మరువరాదని, వైరస్ క్రమంగా మౌనం దాల్చినప్పటికీ దానిపట్ల నిర్లక్ష్యం కూడదని అన్నారు. హోలి, గణేష్ చతుర్ధి, నవరాత్రి, పండరీపూర్ వారి (వార్షిక యాత్ర) తరహాలోనే కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్ పాటించాలని కోరారు.
కాకడ హారతి తరువాత...
సోమవారంనాడు (16వ తేదీ) కాకడ్ హారతి పూర్తయిన తర్వాత నుంచి భక్తులను సాయిబాబాను దర్శించుకునేందుకు ఆలయ నిర్వాహకులు అనుమతించనున్నారు. కోవిడ్ సేఫ్టే ప్రోటోకాల్ ప్రకారం, గంటకు 900 మంది భక్తుల చొప్పున రోజుకు 6,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆన్లైన్ ద్వారా దర్శనానికి దరఖాస్తు చేసుకోవాలి. షిర్డీలోని కౌంటర్ ద్వారా కూడా టోకెన్లు పొందవచ్చు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులను, పదేళ్లలోపు పిల్లలను అనుమతించరు. ప్రతి భక్తులు సామాజిక దూరం పాటించడంతో పాటు, తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భక్తులు ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే పాదాలను ప్రక్షాళన చేసుకోవాలి.