యూపీఏ చైర్ పర్సన్‌గా శరద్ పవార్?

ABN , First Publish Date - 2020-12-11T01:50:31+05:30 IST

యూపీఏ చైర్ పర్సన్‌గా శరద్ పవార్?

యూపీఏ చైర్ పర్సన్‌గా శరద్ పవార్?

ముంబై: యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నాయకత్వం వహించబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కొంత కాలంగా కాంగ్రెస్ బలహీన పడుతుండడంతో యూపీఏ దాదాపు పతనావస్థలో ఉంది. సొంత పార్టీనే నిలబెట్టలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్న నేపధ్యంలో యూపీఏకు మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే యూపీఏకు కాంగ్రెసేతరులు నాయకత్వం వహిస్తే పరిస్థితులు మెరుగు పడొచ్చనే ఊహగానాలు 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పదవికి పవార్ అయితేనే పవర్‌ఫుల్‌గా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ విషయాన్ని ఎన్సీపీ ముందు ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. యూపీఏలో ఉన్న మిత్ర పార్టీలతో ఇలాంటి చర్చలు ఏవీ జరగలేదని, ఇలాంటి ప్రతిపాదనలు తమ వరకు రాలేదని ఎన్సీపీ నేత మహేష్ తపసీ అన్నారు. ‘‘యూపీఏ చైర్‌పర్సన్‌గా శరద్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ విషయమై ఎన్సీపీ ఏ పార్టీతోనూ చర్చలు చేయలేదు. ఏ పార్టీ ఎన్సీసీకి ఇలాంటి ప్రతిపాదనలు పంపలేదు. రైతులు చేస్తున్న ఆందోళన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని మీడియా సంస్థలు పుట్టిస్తున్న పుకార్లు ఇవి’’ అని మహేష్ అన్నారు.

Updated Date - 2020-12-11T01:50:31+05:30 IST