విధ్వేష, తప్పుడు ప్రచారం ఆపండి: జూకర్బర్గ్కు సెలెనా ఘాటు సందేశం
ABN , First Publish Date - 2020-09-20T21:59:40+05:30 IST
విధ్వేష, తప్పుడు ప్రచారం ఆపండి: జూకర్బర్గ్కు సెలెనా ఘాటు సందేశం

వాషింగ్టన్: సోషల్ మీడియా వేదికలపై జాత్యాహంకార, ధ్వేష పూరిత ప్రసంగాలపై ప్రచారలపై తమ గొంతును వినిపిస్తున్న సెలెబ్రిటీల్లో అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ ఒకరు. ఆమె తాజాగా ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్కు ఘాటు సందేశం పంపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తప్పుడు సమాచారం, విధ్వేష ప్రసంగాలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జూకర్కు సెలెనా సూచించారు. ఈ రెండు సోషల్ మీడియా వేదికల్లో ద్వేషం, తప్పుడు సమాచారం, జాత్యహంకారం, మూర్ఖత్వానికి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని, దాన్ని వెంటనే ఆపాలని ఆమె అన్నారు.
దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో జూకర్బర్గ్ను ట్యాగ్ చేసి ఓ సందేశాన్ని పంపించారు. ‘‘మార్క్, షేరిల్.. నేను సెలెనా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో ద్వేషం, తప్పుడు సమాచారం, జాత్యహంకారం, మూర్ఖత్వానికి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. వెంటనే దీన్ని అడ్డుకోమని నేను మీ ఇద్దరినీ సహాయం కోరుతున్నాను. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే, విధ్వేష ప్రసంగాలు చేసేవారి గ్రూపులు, వ్యక్తులను తొలగించండి. ఇది ఎన్నికల సంవత్సరం. మన భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉంది. ఓటింగ్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి కావడాన్ని మనం భరించకూడదు. ఇక్కడ తప్పుడు నిర్ధారణ, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మీరు దీనిపై శ్రద్ధ పెడతారని అనుకుంటున్నాను’’ అని సెలెనా రాసుకొచ్చారు.
కొద్ది రోజుల క్రితం కిమ్ కర్దాషియాన్, లియోనార్డో డికాప్రియో, కాటి పెర్రీతో సహా ప్రముఖులు ‘ఆదాయం కోసం విధ్వేషాలు ప్రచారం చేయకండి’ అనే ప్రచారంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వారి ఖాతాలను 24 గంటలు స్తంభింపజేసింది. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.