క్వారంటైన్ సెంటర్లపై విమర్శలు.. అస్సోం ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు..

ABN , First Publish Date - 2020-04-07T22:04:53+05:30 IST

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లపై విద్వేశపూరితమైన విమర్శలు చేసిన అస్సోం ఎమ్మెల్యేను దేశద్రోహం కేసు కింద అరెస్ట్

క్వారంటైన్ సెంటర్లపై విమర్శలు.. అస్సోం ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు..

గువాహటి: కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లపై విద్వేశపూరితమైన విమర్శలు చేసిన అస్సోం ఎమ్మెల్యేను దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్.. మరో వ్యక్తితో కలిసి క్వారంటైన్ సెంటర్‌ల గురించి మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆయన క్వారంటైన్ సెంటర్లను నిర్భంద కేంద్రాలు అని.. చాలా ప్రమాదకరమైనవి అని అన్నారట.


అంతేకాక.. ఆయన బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం ముస్లింపట్ల వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. తబ్లిగీ జమాత్‌లో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో వైద్య సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి కావాలనే ఇంజిక్షన్లు ఇచ్చి.. వారిని కరోనా వ్యాధి ఉన్నవారిలా చిత్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 


ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్(ఏఐడీయూఎఫ్‌)కి చెందిన అమినుల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అయన్ని మంగళవారం అరెస్ట్ చేశారు. విచారణలో ఆ ఆడియో క్లిప్‌లో ఉన్న గొంతు తనదేనని.. ఆ క్లిప్ తానే వాట్సాప్‌లో షేర్ చేశానని సదరు ఎమ్మెల్యే అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారని అన్నారు. అస్సోం స్పీకర్‌కు ఇందుకు సంబంధించిన సమాచాం ఇచ్చామని డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-07T22:04:53+05:30 IST