ఇజ్రాయెల్ నుంచి భారత్ రహస్య కొనుగోళ్లు?
ABN , First Publish Date - 2020-12-27T09:48:27+05:30 IST
ఇజ్రాయెల్ నుంచి స్పైస్ బాంబులను భారత్ రహస్యంగా కొనుగోలు చేస్తోందా..? అవునంటోంది బ్రిటన్కు చెందిన ‘జేన్స్ డిఫెన్స్ వీక్లీ’ పత్రిక.

వాయుసేనలోకి మరో మూడు రాఫెల్స్!
న్యూఢిల్లీ, డిసెంబరు 26: ఇజ్రాయెల్ నుంచి స్పైస్ బాంబులను భారత్ రహస్యంగా కొనుగోలు చేస్తోందా..? అవునంటోంది బ్రిటన్కు చెందిన ‘జేన్స్ డిఫెన్స్ వీక్లీ’ పత్రిక. ఈ మేరకు తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఉందని కథనాన్ని ప్రచురించింది. ఈ ఒప్పందం గురరించి భారత్ నోరు మెదపకపోగా.. ఇజ్రాయెల్ మాత్రం ఒక ఆసియా దేశం అని ప్రకటించడం గమనార్హం. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 1473 కోట్లు అని తెలుస్తోంది. ఈ నెల 23న ఒక ఆసియా దేశం తమను సంప్రదించిందని, బాంబు గైడెన్స్ కిట్లు, యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, సాఫ్ట్వేర్ ఆధారిత రేడియోలు కావాలని కోరిందని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. రాఫెల్కు జత చేసేందుకు స్పైస్-2000 బాంబులను భారత్ దిగుమతి చేసుకుంటోందని వీక్లీ అంచనా వేసింది. భారత్-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే భారత్ అత్యవసర కొనుగోలుకు కారణమని పేర్కొంది. ఇదిలా ఉండగా.. భారత వాయుసేనలోకి వచ్చే నెల మరో మూడు రాఫెల్ విమానాలు చేరనున్నాయి.