కోవిడ్-19 సోకి తల్లి మృతి.. అంత్యక్రియలకు నిరాకరించిన కొడుకు
ABN , First Publish Date - 2020-04-07T17:49:24+05:30 IST
కోవిడ్-19 సోకి మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహిస్తే.. ఆ వైరస్ తమకు సోకుతుందేమో అనే భయంతో ఆమె శవాన్ని తీసుకోవడానికి కూడా

అమృత్సర్: కోవిడ్-19 సోకి మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహిస్తే.. ఆ వైరస్ తమకు సోకుతుందేమో అనే భయంతో ఆమె శవాన్ని తీసుకోవడానికి కూడా కుటుంబసభ్యులు నిరాకరించిన ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. షిమ్లాపురి గ్రామానికి చెందిన ఆ మహిళ కోవిడ్-19 లక్షణాలతో మార్చి 31వ తేదీన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి.. ఆదివారం ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఆమె మృతదేహాన్ని తీసుకొని వెళ్లి.. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. జిల్లా అధికారులను ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని వాళ్లు కోరారు. ఆఖరికి ఆమె కుమారుడు కూడా ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. అధికారులు తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన అతను అందుకు అంగీకరించలేదు.
‘‘ఆమె బంధువులే కాదు.. ఆఖరికి ఆమె కుమారుడు కూడా ఆమె మృతదేహాన్ని తీసుకొని వెళ్లేందుకు రాకపోవడం చూసి మేము నిజంగా ఆశ్చర్యపోయారు. జిల్లా అధికారులు కుటుంబసభ్యులను రెండుసార్లు సంప్రదించిన వాళ్లు అందుకు అంగీకరించలేదు. ఆమె కుమారుడికి వైరస్ సోకకుండా అంత్యక్రియల సమయంలో రక్షణ ఏర్పాటు చేస్తామని చెప్పినా.. అతను అందుకు అంగీకరించలేదు. చివరికి జిల్లా అధికారులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ’’ అని అదనపు డిప్యూటీ కమీషనర్ ఇక్బాల్ సింగ్ సందు తెలిపారు.
మృతి చెందిన మహిళ కుమారుడితో పాటు.. మిగితా కుటుంబసభ్యులు 100 మీటర్ల దూరంలో నిలుచొని ఆమె అంత్యక్రియలను చూశారని అధికారులు తెలిపారు.