కొవిడ్-19: సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట!
ABN , First Publish Date - 2020-10-01T18:38:44+05:30 IST
దేశంలో కొవిడ్-19 మహమ్మారిని నిలువరించడంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ...
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 మహమ్మారిని నిలువరించడంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ విశ్రాంత బ్యూరోక్రాట్లు దాఖలు చేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 4న కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ మార్చి 4 వరకు అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించలేదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జస్టిస్ ఎల్ఎన్ రావు ధర్మాసనానికి నివేదించారు. ప్రజలు గుమిగూడరాదంటూ హోంశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ.. ఫిబ్రవరి 24న ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఓ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరైనట్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సంపూర్ణ లాక్డౌన్ విధించ వద్దంటూ నిపుణులు ఇచ్చిన సలహాలను సైతం ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని భూషణ్ పేర్కొన్నారు.
లాక్డౌన్ కారణంగా దేశ జీడీపీ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 23 శాతం మేర క్షీణించిందనీ... కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయారని ఆయన నివేదించారు. అయితే దీనిపై ప్రజల్లోనే చర్చ జరగాలని తప్ప కోర్టుల్లో కాదనీ.. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని ధర్మాసనం పేర్కొంది. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో సరైన చర్యలు తీసుకోలేకపోయిందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 కింద ఓ కమిషన్ ఏర్పాటు చేసి స్వంతంత్ర దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్లు కోరారు.