పార్టీ అధికార ప్రతినిధి నుంచి సంజయ్ ఝా అవుట్
ABN , First Publish Date - 2020-06-18T19:40:04+05:30 IST
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి సంజయ్ ఝాను సోనియా గాంధీ తొలగించారు. ఓ పత్రికలో పార్టీని

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి సంజయ్ ఝాను సోనియా గాంధీ తొలగించారు. ఓ పత్రికలో పార్టీని విమర్శిస్తూ ఆయన వ్యాసం రాయడంతో అధిష్ఠానం ఈ చర్యకు దిగింది. ‘‘సంజయ్ ఝాను ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి వెంటనే తొలగిస్తూ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేసింది’’ అని పార్టీ ప్రకటించింది.
‘‘కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయింది. దీని కారణంగా కార్యక్షేత్రంలో అంతగా ఆసక్తి చూపలేకపోతోంది. రాజకీయంగా తీవ్ర చిక్కుల్లో మునిగిపోయింది. ఇంత ఇబ్బందుల్లో ఉన్నా.. అత్యవసరంగా పార్టీని ఉత్సాహ పరిచి నడిపించే వారు లేరు,. ఇంతటి నిర్లక్ష్యాన్ని గ్రహించలేని వారు కూడా పార్టీలో చాలా మందే ఉన్నారు. మా లాంటి వారం గాంధీ ఫిలాసఫీకి, నెహ్రూ ఫిలాసఫీకి బద్ధులమైపోయాం. పార్టీ విచ్ఛిన్నాన్ని చూడలేకపోతున్నాం’’ అంటూ సంజయ్ ఝా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో వ్యాసం రాశారు.
దీంతో అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. అభిషేక్ దత్త్, సాద్నా భారతిలను జాతీయ మీడియా ప్యానలిస్టులుగా నియమిస్తూ సోనియా కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు.