అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచింది : సామ్నా
ABN , First Publish Date - 2020-12-05T19:27:28+05:30 IST
‘ఓవర్ కాన్ఫిడెన్సే’’ బీజేపీ కొంప ముంచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మితిమీరిన విశ్వాసమే బీజేపీ కార్యక్షేత్రంలో
ముంబై : ‘‘ఓవర్ కాన్ఫిడెన్సే’’ బీజేపీ కొంప ముంచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మితిమీరిన విశ్వాసమే బీజేపీ కార్యక్షేత్రంలో సీటు కోల్పోయేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ పరిధిలో రెండు స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. మూడు స్థానాలను గెలుచుకుంది. కానీ... అతిస్వల్ప మెజారిటీతో గెలిచింది. దీన్ని చూస్తేనే అర్థమైపోతోంది. కార్యక్షేత్రంలో బీజేపీ తమ బలాన్ని కోల్పోతోందన్న విషయం.’’ అని సామ్నాలో పేర్కొన్నారు. అయితే ఈ ఓటమి తమకు పెద్ద ఆశ్చర్యమేమీ కాదని, అసెంబ్లీ ఎన్నికల నుంచీ బీజేపీ తమ ఉనికిని కోల్పోతూ వస్తోందని శివసేన పేర్కొంది. నాగపూర్ బీజేపీలో ప్రస్తుతం రెండు గ్రూపులు నడుస్తున్నాయని, ఒకటి గడ్కరీ గ్రూప్ కాగా, మరోటి ఫడణ్వీస్ గ్రూపు అని శివసేన విమర్శించింది. ఈ ఎన్నికల్లో విద్యాధికులు, టీచర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని సామ్నా పేర్కొంది.
మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆరు స్థానాల్లో ఒక్క సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. అధికార శివసేన - ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నెల ఒకటిన మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఔరంగాబాద్, పుణె గ్రూడ్యుయెట్ స్థానాలను ఎన్సీపీ గెలుచుకుంది. బీజేపీకి బలమున్న నాగపూర్ గ్రూడ్యుయెట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.