‘క్వారంటైన్’లో జీతాలు.. ఎదురుచూపులు తప్పవన్న సర్కారు!
ABN , First Publish Date - 2020-07-18T17:30:28+05:30 IST
జీతాలు వేసే సిబ్బంది హోం క్వారంటైన్కి వెళ్లాల్సి రావడంతో గోవాలో ఉద్యోగులు జీతాల ..

పనాజీ: జీతాలు వేసే సిబ్బంది హోం క్వారంటైన్కి వెళ్లాల్సి రావడంతో గోవాలో ఉద్యోగులు జీతాల కోసం పడిగాపులు కాయాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. జీతాల బిల్లులు సిద్ధంచేసే సిబ్బంది క్వారంటైన్లో ఉన్నందున రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లలోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి ఈ నెల జీతాలు ఆలస్యం కానున్నాయని గోవా విద్యాశాఖ వెల్లడించింది. ‘‘విద్యాశాఖ డైరెక్టరేట్ చెందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ (జీఐఏ) ఉద్యోగి ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఎయిడెడ్ స్కూళ్లకు బిల్లులు చెల్లించే ఈ విభాగంలోని ఉద్యోగులంతా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. అందువల్ల శాలరీ బిల్లులు సిద్ధం చేసే ప్రక్రియ నిలిచిపోయింది...’’ అని విద్యాశాఖ డైరెక్టర్ వందనరావు పేర్కొన్నారు. జీఐఏ సిబ్బంది తిరిగి విధుల్లోకి చేరితే తప్ప బిల్లులు ముందుకు కదిలే అవకాశం లేదనీ.. దీనివల్ల ఈ సారి సంబంధిత ఉద్యోగులు వేచిచూడక తప్పదని ఆయన అన్నారు. కాగా విద్యాశాఖ సమాచారం ప్రకారం... రాష్ట్రంలో మొత్తం 465 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి.