ఉద్ధవ్ థాకరేతో ఎస్ఏడీ నేతల భేటీ

ABN , First Publish Date - 2020-12-06T20:29:19+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను శిరోమణి అకాలీ దళ్

ఉద్ధవ్ థాకరేతో ఎస్ఏడీ నేతల భేటీ

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేతలు ఆదివారం కలిశారు. ఎస్ఏడీ నేత ప్రేమ్ సింగ్ చందుమజ్రా నేతృత్వంలోని ప్రతినిథి బృందం వర్ష బంగళాలో ఉద్ధవ్‌తో సమావేశమైంది. ఉద్ధవ్ థాకరే కార్యాలయం ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. 


‘‘శిరోమణి అకాలీ దళ్ నేత ప్రేమ్ సింగ్ చందుమజ్రా వర్ష బంగళాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరేతో సమావేశమయ్యారు’’ అని ఉద్ధవ్ థాకరే కార్యాలయం ట్వీట్ చేసింది. 


వ్యవసాయ చట్టాలపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి శిరోమణి అకాలీ దళ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో చొరవ తీసుకుంది. ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రేమ్ సింగ్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీతో కోల్‌కతాలో శనివారం సమావేశమయ్యారు. నూతన వేదికకు మద్దతివ్వాలని కోరారు. వీరి సమావేశం అనంతరం టీఎంసీ ఎంపీ సుదీప్ బెనర్జీ మాట్లాడుతూ, రైతు సంఘాలు డిసెంబరు 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని, దీనికి తమ పార్టీ నైతికంగా మద్దతు ఇస్తోందని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో కూడా ప్రేమ్ సింగ్ త్వరలో సమావేశమవుతారని తెలుస్తోంది.


Updated Date - 2020-12-06T20:29:19+05:30 IST