ఇటీవలి కరోనా కేసులు.. వైరస్ వ్యాప్తికి కొలమానం కాదు: కేంద్ర ఆరోగ్యశాఖ

ABN , First Publish Date - 2020-04-02T01:17:09+05:30 IST

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ 1600 మందికిపైగా ఈ వైరస్ బారినపడ్డారు.

ఇటీవలి కరోనా కేసులు.. వైరస్ వ్యాప్తికి కొలమానం కాదు: కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ 1600 మందికిపైగా ఈ వైరస్ బారినపడ్డారు. ముఖ్యంగా గడిచిన 48 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ పరిణామాలపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్రజలు భయపడాల్సిన  అవసరం లేదని ధైర్యం చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్  ఓ ప్రకటన చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘దేశంలో ఇటీవల పెరిగిన కరోనా కేసులన్నీ ఓ మత సంబంధ కార్యక్రమానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ కేసులను చూపించి దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతుందనడం తప్పు’ అని ఆయన అన్నారు. కాగా, నిజాముద్దీన్‌లో జరిగిన ఓ మర్కజ్ కార్యక్రమంలో 2వేల మందికిపైగా పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో చాలామంది విదేశాల నుంచి వచ్చిన వారే. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో పలువురికి కరోనా సోకింది.

Updated Date - 2020-04-02T01:17:09+05:30 IST