మహానదిలో మునిగిన దేవాలయాన్ని పునరుద్ధరించాలి : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ABN , First Publish Date - 2020-06-19T01:21:50+05:30 IST
ఒడిశాలోని మహానదిలో మునిగిపోయిన గోపీనాథుని దేవాలయాన్ని

భువనేశ్వర్ : ఒడిశాలోని మహానదిలో మునిగిపోయిన గోపీనాథుని దేవాలయాన్ని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 500 ఏళ్ళనాటి ఈ దేవాలయాన్ని ఓ ప్రభుత్వేతర సంస్థ పరీక్షించిందని పేర్కొన్నారు. ఈ దేవాలయం 1933లో ఒడిశాలో సంభవించిన వరదలలో మునిగిపోయినట్లు చెప్తున్నారని తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు దర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖలో, గోపీనాథుని దేవాలయం బైదేశ్వర్ సమీపంలో మహానదిలో మునిగిపోయిందని, ఇది సుమారు 500 సంవత్సరాలనాటిదని తెలిపారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ దేవాలయాన్ని పరీక్షించిందని తెలిపారు. దీనికి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉందని, సురక్షిత స్థితిలో ఉందని గుర్తించారని పేర్కొన్నారు. ఈ దేవాలయం ఎత్తు సుమారు 60 అడుగులు ఉండవచ్చునని అంచనా వేశారన్నారు.
ఈ దేవాలయం నిర్మాణానికి వాడిన సామగ్రి, నిర్మాణ శైలిని బట్టి, ఇది 15 లేదా 16వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నట్లు తెలిపారు.